ఎడారిలో సెలయేర్లు - మే 21
📖నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసికొందును (కీర్తన 77:6).
పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు యజమాని కోరిన పాట ఎంతమాత్రమూ పాడదు. ఓ కూనిరాగం తీస్తుందేమోగాని పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు.
చాలామంది చీకటి అలుముకుంటేనే గాని పాటలు పాడడం నేర్చుకోరు.
నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముల్లుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట.
దూతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి. ‘ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి’ అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది.
👉 నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి, చీకట్లు ఆవరించే వరకూ ఆత్మకు తనను ఊరడించి సంతృప్తి పరచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు.
వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది, ఉదయకాంతి అనేది రాత్రి చీకటి కడుపులోనుంచే వస్తుంది.
నటాలీ అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు.
“అదో మరుపురాని ప్రయాణం, గులాబి పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాలనుండే ఎగుమతి ఔతుందని నాకప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబి పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు.
మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకొన్నాను. వైజ్ఞానిక పరీక్షలు ఋజువు చేసిందేమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబి పూలలో నుండి 40 శాతం పరిమళం తగ్గిపోతుందని.”
👉 ఈ ఉదాహరణను మన ఆత్మలకు ఎలా అన్వయించుకోగలం?
ఆ గులాబీలు చీకట్లో ఉన్నపుడు కలిగినంత పరిమళం వెలుగులో ఉన్నప్పుడు కలిగి ఉండటం లేదు. అలాగే మనం కూడా చీకటి బాధలలో ఉన్నప్పుడే ఎక్కువగా క్రీస్తు పరిమళాలను పోగు చేసుకుంటాం.