ఎడారిలో సెలయేర్లు - మే 3

ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు (యోవేలు 2:32).

👉 నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్త ధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరుగెత్తాలి?

ఆయనకే ఎందుకు నేరుగా మొర్ర పెట్టకూడదు?

నాకై నేను కూర్చుని పథకాలూ, అంచనాలు వేసుకోవడం దేనికీ?

ఏ గొడవా లేకుండా నన్నూ నా భారాన్ని ఆయన మీద వెయ్యడానికి అభ్యంతరం ఏమిటి?

గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరుగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటూ, ఇటూ పరుగెత్తడం దేనికీ? సహాయం కోసం మరెక్కడో వెదికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి?

📖అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యలనుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయతను ఆయన నాకిచ్చాడు.

ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే “ప్రార్థన చేయు వారందరును” అనే మాట అంతు లేనిది. ‘వారందరును’ అనే దాన్లో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగినవాళ్ళు ఎవరైనా, అందరికీ అది వర్తిస్తుంది.

👉 ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను.

👉 నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకనవసరం.

వాగ్దానం చేసినవాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు, పద్దతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడడమే. ఆయనకి సలహాలివ్వడానికి నేనెవరిని? నేనాయన భృత్యుణ్ణి మాత్రమే. మంత్రిని కాను. మొర్రపెట్టడమే నా వంతు. విడిపించడం ఆయన పని.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్